Latest News

హరీశ్ రావుపై సీఎం వ్యాఖ్యలు దుర్మార్గం

31 May, 2026 79 Views
Main Image



హరీశ్ రావుపై సీఎం వ్యాఖ్యలు దుర్మార్గం


(అవని ప్రతినిధి) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు అధికార అహంకారానికి పరాకాష్ట. హరీశ్ రావు రాజకీయ జీవితం కేసీఆర్ ఆశీస్సులు, ఆలోచనలతో ప్రారంభమై, ఒకే రాజకీయ పార్టీలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న హరీశ్ రావుపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.కానీ రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్‌తో ప్రారంభమై, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల గుండా సాగిన విషయం ప్రజలకు తెలిసిందే. ‘వోటుకు నోటు’ వ్యవహారం ద్వారా అవకాశవాద రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన రేవంత్ రెడ్డి, ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకులపై విమర్శలు చేయడం దుర్మార్గం.

రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేసే సామర్థ్యం కూడా లేని నిర్వీర్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకే బీఆర్ఎస్ పార్టీపై కక్షపూరిత చర్యలకు దిగడం సిగ్గుచేటు. కేటీఆర్‌పై ఫార్ములా-ఈ కేసు, కేసీఆర్‌పై ఘోష్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ, ఒక్క ఆరోపణను కూడా నిర్ధారించలేకపోయారు. దీంతో నిందలు, వ్యక్తిత్వ హరణల ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మాత్రం కేసులు పెట్టి మానసిక ఆనందం పొందడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు.సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలకు కారకులైన నేతలను కీర్తించడం ద్వారా తెలంగాణ సమాజంలో అలజడి సృష్టించే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటిని ప్రశ్నిస్తున్న ప్రజలపైనే ఎదురుదాడికి దిగుతున్నారు.కాంగ్రెస్ పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలని ప్రజలు బహిరంగంగా ప్రకటిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేదని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్‌పై ముప్పేట దాడి చేసేందుకు ఇతర రాజకీయ పార్టీలతో ఆంతరంగిక ఒప్పందాలు చేసుకుని తెలంగాణ అస్తిత్వంపై దాడులకు పాల్పడుతున్నారు.

కేటీఆర్, హరీశ్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. ప్రజల కోసం పోరాడే నాయకులపై రాజకీయ బురద జల్లే ప్రయత్నాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేస్తేనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదు.


– దేవీప్రసాద్ 

మాజీ కార్పొరేషన్ చైర్మన్.