ఉద్యమకారుల సభను విజయవంతం చేయండి.
సిద్ధిపేట, మే 31(అవనివిలేకరి)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన సిద్దిపేట జిల్లా తెలంగాణ ఉద్యమకారులు నిర్వహించ తలపెట్టిన సభను విజయవంతం చేయాలని ఉద్యమకారులు కోరారు. సిద్దిపేట జిల్లా ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే ఉద్యమకారులు మొదటగా రంగధాంపల్లి చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఉదయం 10 గంటలకు నివాళులు అర్పించాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుండి సిద్దిపేట ప్రెస్ క్లబ్ చేరుకొని ఉదయం 11 గంటలకి జరగబోయే సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, కళాకారుల, న్యాయవాద, విద్యార్థి తదితర సంఘాలకు సంబంధించిన వారందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించాల్సిన విధివిధానాలకు సంబంధించిన అంశాలపై అందరి అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. తదనంతరం ఒక నివేదికను రూపొందించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీకి సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ డాక్టర్ పాపయ్య, తిరుపతి రెడ్డి, డాక్టర్ పెద్దిరాజు, జి.సత్తయ్య, ఖమ్మంపల్లి యాదగిరి, ఎ.శ్రీహరి, పోచబోయిన శ్రీహరి యాదవ్, కూతురురాజిరెడ్డి, పర్కపల్లి యాదగిరి, బి.చంద్రబాను, మధుసూదన్ రెడ్డి, డప్పు బాబు తదితరులు పాల్గొన్నారు.